Sunday 8 November 2015

దీక్ష

దీక్ష....
దీక్ష అంటే ఏమిటి? ఓక రోజు దీక్ష, మూడు రోజుల దీక్ష, ఐదు రోజుల దీక్ష, తొమ్మిది రోజుల దీక్ష,  పక్షం రోజుల దీక్ష, ఇరువది ఒక్క రోజు దీక్ష, మండల (40) రోజుల దీక్ష, మూడు నెలల దీక్ష, నాలుగు నెలల దీక్ష.....ఇలా పోతూ వుంటుంది....
దీక్ష అంటే మాసిన గడ్డంతో కనిపిస్తారు అందరూ....అంటే దీక్షలో వుంటే గడ్డం గీసుకోకూడదు, తల చమురు పెట్టుకోకూడదు, తల దువ్వుకోకూడదు, అద్దం చూడకూడదు, పరుపుల మీద పడుకోకూడదు, పరుపులు తాకకూడదు, సినిమాలు, సీరియల్స్ చూడకూడదు, చెత్త సాహిత్యం చదవకూడదు....రజో, తమోగుణములను ప్రేరేపించే ఏ పనులూ చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, కలలో కూడా కామ కోరికలు కలగకూడదు, మనసును రెచ్చగొట్టే దృశ్యములను, మాటలను, పదార్ధములను కనకూడదు, వినకూడదు, రుచి చూడకూడదు...తాంబూలం సేవించకూడదు.... ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మసాలా దినుసులు వాడకూడదు....పులుపు పదార్ధములు సేవించకూడదు..వేడి చేసే పదార్ధములు తినకూడదు.....ఆహారంలో సాత్విక పదార్ధములు మాత్రమే వుండాలి. భగవంతుడికి నివేదన చేసి తినాలి....బయట పదార్ధములు తినకూడదు....వీలైతే అమ్మ చేతి వంటే తినాలి....కోరికలతో వున్న వాళ్లు చేసిన వంట తినకూడదు....ఓంటిపూట మాత్రమే తినాలి, కడుపు నిండా తినకూడదు....రుచికరమైన పదార్దములు తినకూడదు....ఉప్పు కారం లేని పదార్దములను మాత్రమే తినాలి....వడ్డించే వాళ్లు పవిత్రమైన మనస్సుతో వడ్డించాలి....అంటు తగలకూడదు ....ఆడవాళ్లు బహిష్టు అయిన ఇంట్లో వుండకూడదు...మూడు సార్లు తలకు స్నానం చేయవలయును....నేల మీద చాప వేసుకొని దిండు లేకుండా పడుకోవలయును....భగవంతుడికి అతి సమీపములో ఎప్పుడూ వుండవలయును...మనసులో భగవంతుడి నామం, జపం చేస్తూ వుండవలయును....త్రికరణ శుద్దిగా మనసును నిర్మలంగా వుంచుకొని, కామ క్రోధములను జయించి భగవత్ ఆరాధన చేస్తూ వుండవలయును.....దేహమును, మనసును అగ్ని సమానముగా పవిత్రముగా వుంచుకొనవలయును.....ఊరి బయటి చెరువును దాటి వెళ్లకూడదు....ఇతరుల ఇళ్ళకు వెళ్లకూడదు ....ఎక్కువ సేపు మౌనం పాటించవలయును....జప మాల ధరించవలయును....స్త్రీలతో హాస్య ఛలోక్తులు మాటలాడకూడదు.....ఎవ్వరినీ కవ్వించకూడదు.....వాదనలు, తగువులు, అబద్ధములు ఆడకూడదు, సత్యమునే చెప్పవలయును.....తోలు వస్తువులు ధరించకూడదు...అతి నిద్ర పోకూడదు....మనసు చంచలం కాకూడదు....పవిత్రమైన వస్తువులను దగ్గరగా వుంచుకోవలయును.....గురువులకు, తల్లిదండ్రులకు, గుడికి,  నదికి దగ్గరగా వుండవలయును.....చన్నీటి స్నానము చేయవలయును.....విభూతి రేఖలు ధరించి , దీక్షా వస్త్రములు ధరించి, ఆశ్రమ వాసునిగా, అతి సాధారణంగా కనిపించవలయును....

ఈ దీక్షలన్నీ నేను పాటించాను, అందుకే పొల్లుపోకుండా వ్రాయగలిగాను....స్వయంగా ఆచరించినది....పుస్కములో చూసి వ్రాసినది కాదు....శ్రీవిద్యాదీక్ష, శ్రీవిద్యోపాసన అంటే ఇదే.....అంత కఠినంగా వుంటాయి....చేసి సాధించాను గనుకే పాదుకాంత పూర్ణదీక్ష వచ్చినది, ఈ మాటలు గర్వంగా చెప్పగలుగుతున్నాను ..ఈనాడు దీక్ష అంటే తెలియకుండా గడ్డం పెంచుకొని, మెడలో ఒక మాల వేసుకొని చెయ్యకూడని అన్ని పనులు చేస్తూ తిరుగుతున్నారు....అందుకే బాధ వేసి ఇలా వ్రాసాను...

.....భాస్కరానంద నాథ/08-11-2015

Wednesday 16 September 2015

తత్త్వదర్షిని - అద్వైతం...

మరొక్క మాట మీరు అడగక పోయినా చెబుతున్నాను.
అది రహస్యమే. ఎవరికి వారుగా తెలుసుకోవాలి, కానీ మీ తపన చూచి ఆగలేక నేనే చెప్పేస్తున్నాను. అది ఏమిటంటే
శ్రీ లలితే శ్రీ విష్ణువు, శ్రీ విష్ణువే శ్రీలలిత. సాధనలో, ఉపాసనలో ఈ విషయము మనకు గోచరిస్తుంది. నమ్మకము కుదురుతుంది. అమ్మే మనకు ఆ జ్ఞానము ఇస్తుంది.
పురుష రూపములో శ్రీ మహా విష్ణువును కోలుచుకోవచ్చు, స్త్రీ రూపములో మహా త్రిపుర సుందరిని కోలుచుకోవచ్చు.
అందుకే వారి ఇద్దరికీ చాలా సామీప్యములు వుంటాయి. మగ వాడు నిజముగా అలంకరణకు దూరముగా వుంటాడు, కానీ ఇక్కడ శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడు. ఎందుకంటే లోపల వున్నది శ్రీ మహా త్రిపుర సుందరి. పైకి వేషము పురుష వేషము లోపల స్త్రీ మనస్సు , అంటే లోపల వుండేది శ్రీ లలిత. కాబట్టి వారు ఇద్దరు ఒక్కటే. అందుకే శ్రీ వెంకటేశ్వరునికి శుక్ర వారపు అభిషేకము.
౧. అయిన సృష్టి పాలన చేస్తాడు,, ఈమె కూడా  చేస్తుంది.
౨.  అయిన అవతారములు ఎత్తుతాడు, ఈమే అవతారములు ఎత్తుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వీళ్ళ ఇద్దరు మాత్రమె  
      చేస్తారు.
౩. నారసింహ, నార సింహి. ప్రత్యంగిర, వరాహము - వారాహి, ఇలా.
౪. మోహినీ అవతారము. ఇది అమ్మ మహా దేవి ఇచ్చినదే, మోహినీ అవతారము ఎత్తి శ్రీ మహా దేవుణ్ణి మురిపిస్తాడు. ఆ మోహిని లో వున్నది  ఎవరో కాదు తన భార్య శ్రీ  లలితే.
౫. మగ వాడు ఎప్పుడూ పిల్లలను కనడు సృష్టిలో, మగ వాడి కడుపులో గర్బ సంచి వుండదు, సృష్టి క్రమమునకు కావలసిన శరీర సానుకూల్యత మగ వాడిలో లేదు.  మరి అలాంటప్పుడు శ్రీ మహా విష్ణువు కడుపులో నుంచి , ఆయన నాభి కమలములో నుంచి బ్రహ్మ దేవుడు ఎలా పుట్టినాడు. ఈ సృష్టి అంతా శ్రీ మహా విష్ణువు కడుపులో వున్నది, అయన కడుపు లోనుంచి వచ్చినది అని అంటే ఎలా గర్బ సంచి లేకుండా ఎలా వస్తుంది. వచ్చింది ఎందుకంటే ఆయన పురుష రూపము లో    వున్న శ్రీమాత కాబట్టి.
౬. ఇప్పుడు శ్రీ మహా విష్ణువు గా వున్నది శ్రీమాత యొక్క అంశ, శ్రీమాత యొక్క భగిని. అంటే చెల్లెలు. శ్రీ మాత యొక్క చెల్లెలు శ్రీమహావిష్ణువు రూపములో వుండి    పాలనా భాద్యతలు చేపట్టినది.
౭. కాబట్టి శ్రీమాత మరియు శ్రీమహా విష్ణువు ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు.
౯. శంకరునికి పురుష రూపము లో వున్న మహా విష్ణువు బావ మరది, భార్య తమ్ముడు. లేదు అలా కాదు స్త్రీ రూపము అని అనుకొంటే మహా దేవునికి, శ్రీ మహా విష్ణువు మరదలి వరుస అవుతుంది. బార్య చెల్లెలు, తన బార్య లాగే అదే రూపముతో వున్నాడు శ్రీమహా విష్ణువు. కాబట్టి మోహినీ రూపం లో వున్న మహా విష్ణువును కామించినాడు, మోహించి నాడు. కారణము ఏదైనా వుండ వచ్చు.

కాబట్టి నారాయణ - నారాయణి అన్నా చెల్లెళ్ళు  లేదా  స్త్రీ రూపములో చెప్పుకుంటే అక్కా చెల్లెళ్ళు. అక్క మహా త్రిపుర సుందరి.
కాబట్టి శంకరుడు,  శ్రీమన్నారాయణుడు కు బావ గారు. సంబంధము అర్ధమైనదా?

శ్రీ విష్ణువు / శ్రీ లలిత ..... రెండూ ఒకటే స్వరూపము తత్వముగా. పురుష సూక్తము/ దేవీ సూక్తము.
నారాయణుడు / నారాయణి ......రెండూ ఒకటే స్వరూపము తత్వముగా. ఇది అన్నా చెల్లెళ్ళ సంబంధము.
కాబట్టి రాముడు శ్రీవిద్యా రామం. రాముడు శ్రీ లలితా త్రిపుర సుందరి స్వరూపము. అందుకే పుంసాం... మోహన రూపాయ.
అందము అంతా ఆడ దానిలో వుంటుంది. మగ వాడిలో ఏముంది. ఏ మాసి పోయిన గుడ్డ అయినా, లేక గోచి అయినా కట్టు కొని వెళ్లి పోతాడు.  కానీ స్త్రీ మూర్తి అలా కాదు. పట్టు చీరతోనే కదులుతుంది. అందం అంతా అమ్మదే. అందకే ఆమె మాయా స్వరూపిణి.

అయితే ఇక్కడ మనము పప్పులో కాలు వేయకూడదు. అంటే శివుడు గొప్ప విష్ణువు తక్కువ అని కూడా మనము అనుకోకోడదు. ఎందుకంటే అన్నింట్లో వుండేది మరలా ఆ రూపమే ఆ శివ తత్వమే అమ్మ లో వున్నది. ఆ అమ్మ తత్వమే విష్ణులో వున్నది. అదే తత్వం సప్త ఋషులలో వున్నది. అలా అవరోహణ క్రమములో వస్తే అదే శ్రీ చక్ర రహస్యము బిందువు నుంచి క్రిందకి దిగుతూ వస్తే ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అలా ఒకరిలో నుంచి ఒకరు ఇలా సృష్టి క్రమం జరుగుతూ వచ్చి మన తాత లు మన నాన్న తరువాత మనము, మన బిడ్డలు ఇలా సాగి పోతూనే వున్నది. ఇప్పుడు చూడండి.

అందరిలో వుండేది ఆ పరమాత్మ చైతన్యమే. ఆ శివుడే అందరిలో వున్నాడు. శివుడు వేరు శంకరుడు వేరు. శంకరుడు త్రిమూర్తులలో ఒకరు. త్రిమూర్తుల్లను సృష్టించినది అమ్మ, అమ్మకు భర్త అయ్యా మహా దేవుడు. అయినే శివుడు, అయినే పరమాత్మ, పర బ్రహ్మ స్వరూపము, మన అమ్మ నాన్నల పేర్లు
కామ కామేశ్వర్లు. అందరిలో వుండేది శివ చైతన్యము, అదే నటరాజ స్వరూపము. ఎప్పుడూ కదులుతూ వుంటుంది, ఆ కదలిక ఆగి పోతే ఆ శివ తాండవము ఆగి పోతే శవము. అంతే.
వుంటాను మరి.

ఆ పరమ శివుడిది ఏమీ లేదు, అంతా అమ్మదే పెత్తనము. ఆమె అయన శక్తి. చేసేదంతా ఆమె. ఆయనలో కోరికలు కలిగించి, చలనము కలిగించి, స్పందన కలిగించి సృష్టి కార్యము మొదలు పెట్టిస్తుంది. ఆ శ్రీ లలిత వలెనే పర బ్రహ్మము రెండు అవుతుంది. అదే ప్రకృతి పురుషులు. మొదటి సాకార రూపములు. వాల్లే ఆది దంపతులు.అందుకే అందరూ వాళ్ళను కొలుస్తారు. రుక్మిణీ దేవి ఈ ఆది దంపతులనే పురాణ దంపతులని కొలిచినది. అమ్మే అన్నింటికీ నాంది కాబట్టి,
అమ్మే పురుష రూపములో విష్ణువు కాబట్టి వైష్ణవులు ఈ సృష్టి అంతా విష్ణువే చేసాడు, పరి పాలించాడు, ఆయనే కర్త అని అంటారు. అదీ కరక్టే ఎందుకంటే ఆ విష్ణువే శ్రీ లలిత, ఆ లలిత మరెవరో కాదు మహా దేవుని యొక్క శక్తి, ఆ శక్తి లేనిదే ఆయన కదల లేడు.
కాబట్టి శ్రీ మహా విష్ణువు సర్వ వ్యాపకుడు ఆయినే పరమాత్ముడు అన్న అది కరక్టే. నిజమే మనము ఒప్పుకోవాలి.
కాదు శ్రీమతే సర్వ వ్యాపకురాలు, ఆమె ఈ సృష్టి కార్యము చేస్తున్నది అని అన్నా అదీ కరక్టే, నిజమే మనము ఒప్పుకోవాలి.
కాదు ఆ మహా దేవుడే ఇదంతా చేస్తున్నాడు అని అన్నా, అవును నిజమే అని మనము ఒప్పుకోవాలి.
ఎందుకంటే అందరిలో వుండేది ఆ చైతన్యమే. అందరూ వున్నారు. ఎవ్వరూ లేరు. ఇదే అద్వైతము.
వుండేది ఒక్కటే చివరకి.
ఇదీ రహస్యము

అద్వైతములో,  వున్నారు అంటే వున్నారు, లేరంటే లేరు.   ఉన్నారు అని నిరూపించ వచ్చు, లేరని నిరూపించ వచ్చు. మొదట్లో సాధకునికి ఇద్దరు అని వేదము చెప్పుకొంటూ వస్తుంది. బాగా అర్ధమయి, పట్టు కుదిరిన తరువాత ఒరేయ్ ఇద్దరు లేరు రా ఉన్నది ఒక్క పదార్ధమే రా అని చెబుతుంది. ఒక్కసారి మొదట్లోనే నిర్గుణ పర బ్రహ్మాన్ని గురించి చెబితే సాధకుడు పట్టుకో లేడు. అందుకే అందరూ వున్నారు. నిజముగా వున్నారా అని అడిగితే ఎవ్వరూ లేరు ఉన్నది ఒక్కటే అంటుంది. లలితా పరా భట్టారిక పర బ్రహ్మ పట్టమహిషి. ఆమే ఆయిన, ఆయినే ఆమె. మరలా వారిద్దరూ ఒక్కటే. మనకోసము రెండుగా విడివడినాయి. ఆమె చిచ్ఛక్తి, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి , ఆమె వలెనే మనమందరమూ వచ్చినాము. మనమేమిటి త్రిమూర్తులు కూడా. ఆమె లో నుంచే త్రిగుణములు పుట్టినవి. ఆ త్రిగుణములకు సాకార రూపములే మన త్రిమూర్తులు, వారి శక్తులే వారి భార్యలు. ఇలా సృష్టి మొదలైనది. ఇంతమంది బ్రహ్మలు ఇంత మంది దేవతలు, ఇంత సృష్టి వున్నదా అంటే లక్షణముగా వున్నది. మన మందరమూ లేమా, అలాగే దేవతలు, రాక్షసులు అందరూ వున్నారు. నిజముగా వున్నారా అని అంటే ఇంత మంది లేరు ఉండేది ఒక్కటే ఆ పరమాత్మే అది అని. కాబట్టి అందరిలో వుండే ఆ పరమాత్మను తెలుసుకోవడమే అద్వైతము. అందరిలో వున్న ఆ పరా శక్తికి నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమో నమః

కర్మ కాండ, జ్ఞాన కాండ రెండూ సమాన్తరముగా కొనసాగాలి. ఏదీ వదలి పెట్ట కూడదు. కొన్నాళ్ళకు మనకు తెలియకుండానే జ్ఞాన కాండలోకి మారి పోతాము.
అయినా సరే కర్మ కాండను వదలి పెట్ట కూడదు. పెద్దలు చెప్పిన సాంప్రదాయమును వదలకూడదు. నీవు జ్ఞానివి అయినా ఇతరుల కొరకు ఆచరించాలి. సాంప్రదాయమును గౌరవించాలి.

అయ్యా
ఇంక ఎంతో దూరము లేదు అది చేరు కోవడానికి, ఎక్కువ సమయము కూడా పట్టదు. ఇలాగే చింతన చేయండి. మీరే పట్టుకోగలరు. అప్పుడు మీకు ఆనందమే ఆనందము. భేద భావములే కనిపించవు. అన్ని రూపాలు ఒక్కటిగా కనిపిస్తాయి.అన్నింటిలోనూ ఒకే రూపము కనిపిస్తుంది. మీ ఇష్ట దేవత అన్ని రూపాలలో కనిపిస్తుంది. మహా జ్ఞానులు ఎలా తరించినారంటే ఇలాగానే. అసలు ఏ దేవుడు పల్లేదు. ఒక చేట్టులోకి ఆ పర దేవతను ఆహ్వానించి, పూజించి తరించ వచ్చును, జ్ఞాని కావచ్చును, మోక్షము కూడా పొంద వచ్చును. కాదంటారా. మరి ఎలా జరుగుతున్నది. ఇంత మంది దేవుళ్ళు ఉన్నారా? వుంటే ఎవరు గొప్ప? ఎవరికీ ఎంత శక్తి వున్నది. ఎవరిని కొలిస్తే మనకు ముక్తి లభిస్తుంది.
ఉదాహరణకు
౧. మనము రాముణ్ణి కానీ, నారాయుణ్ణి కాని లేక ఏ లక్ష్మి నో గానీ పూజిస్తున్నాము అనుకోండి.
   మీరు రాముణ్ణి రాముడిగానే చూస్తూ కొలిచినారనుకోండి, అయిన రాముడిగానే మీకు వరాలు ఇస్తాడు.అంత వరకే అయిన మీకు సహాయము చేస్తాడు.
   అదే రాముణ్ణి మీరు పర బ్రహ్మ స్వరూపముగా కొలిచినారనుకోండి, భావన చేసారనుకోండి అప్పుడు అది వేరు. అది మోక్షమునకు దారి తీయును.
   మనము ప్రతి దేవతను అలా పర బ్రహ్మ స్వరూపముగా కొలిచినప్పుడే ఇది వీలు అగును.
   లక్ష్మిని లక్ష్మిగా కొలిస్తే దొరికేది ఒకటి, అదే లక్ష్మిని పర దేవతగా, మహా త్రిపుర సుందరిగా కొలిస్తే దొరికేది ఒకటి, అంటే అన్నీ ఆమె నుంచే మనకు దొరుకుతాయి.
   అంటే ఆ లక్ష్మి నుంచే మనకు విద్య, ధనము, శక్తి, ఆరోగ్యము అన్నీ దొరుకుతాయి. మరలా మనము ఒక్కో దానికి ఒక్కో దేవతను వెతుక్కొనే పరిస్థితి అక్కర లేదు.
  మనము అలా చూడటము నేర్చుకోవాలి.  నీవు చూచే స్వరూపము లోనే, కొలిచే దేవుడిలోనే ఆ పర బ్రహ్మ స్వరూపాన్ని చూడటము నేర్చుకో. అదే తత్వ దర్శనమ్.
  సత్యాన్ని గ్రహించు, అవతల నీకు వీలైన పద్ధతి లో, ఇష్ట మైన పద్దతిలో నీ జీవనం కొనసాగించ వచ్చు.
  ఆభరణములలో వున్నది బంగారమే అని తెలుసు కోవడమే అది. మనము (స్త్రీలు) నగలనే చూస్తాము, దాని యొక్క రూపును, shape, model, varaity ఇవి చూస్తాము., కానీ మార్వాడీ వాడు, ఒక కంసాలి దాని లోని బంగారమును మాత్రమే చూస్తాడు. అలా మనము అన్ని రూపాలలోని ఆ పర బ్రహ్మమునే చూడాలి.

ఇవి అన్నీ శ్రీ మహా విష్ణువుకు కట్టబెట్టినారు. అయిన ఏవేవి కార్యాలు చేస్తారో అవన్నీ నారాయణి రూపములోని ఆ మహా దేవత అయిన లలితా త్రిపుర సుందరి, ఆ బ్రహ్మ కీట జనని చేస్తుంది. కాబట్టి శ్రీ లలితే శ్రీ విష్ణువు, శ్రీ విష్ణువే శ్రీ లలిత. అందుకే శ్రీ వేంకటేశ్వరుడు బాలాజీ అయినాడు. అంటే బాలా త్రిపుర సుందరి.
సశేషం....

మూడు గుణములతో కూడినది, ప్రకృతి మాతయై, మహా మాయయై మహా త్రిపుర సుందరియై ఒప్పారుచున్నది ఆమె, ఆమె లోని త్రిగుణములే త్రిమూర్తులుగా రూపములు తీసుకోన్నవి. ఆమె లోని శక్తియే మూడు రూపములై లక్ష్మి, పార్వతి, సరస్వతిగా త్రిమూర్తులకు శక్తిని ఇవ్వడానికి వారి భార్యల రూపములలో వారి ప్రక్కన చేరి సహకరించు శక్తి మాతలుగా వున్నవి. పర బ్రహ్మము లోని శక్తి అంతా కలసి ఒక రూపు దాలిస్తే అదే మహా త్రిపుర సుందరి. ఆమె వలెనే ఆయినకి చలనము కలుగుతుంది. లేక పోతే అయిన స్థాణువు. పర బ్రహ్మములో కదలికలు కలిగించేది శ్రీమతే. రెండుగా విడివడి నప్పుడు, వారు కామ కామేశ్వరులు అవుతారు. ఇక అక్కడి నుంచి భార్యాభర్తలు అనే భంధము, సృష్టి కార్యము జరుగుతుంది. అందుకే ఆమెను ఆద్య కుటుంబిని అని అన్నారు. అమ్మలగన్నయమ్మ... అని అన్నారు. సనాతని అని అన్నారు. ఆమె మన అందరికీ తల్లి. ఆమె వలెనే మనకు, దేవతలకు శక్తి వచ్చినది. జ్ఞానులకు జ్ఞానమిచ్చే శక్తి ఆమె. ఆమె లేక పోతే ఆ మహా శివుడే ఇక కదలడు, ఇక దేవతలు ఒక లెక్కా. సృష్టి జరగదు. జగత్తు వుండదు. అందరూ స్థాణువులు అవుదురు.

ఆమె కదలికలు ఆగి పోయినప్పుడు, అప్పుడు మహా ప్రళయము సంభవించును. అప్పుడు ఆమె మహా ప్రళయ సాక్షినియై చూస్తూ వుంటుంది. జరగ బోయే మహా వినాశనానికి ప్రత్యక్ష సాక్షి ఆమె ఒక్కతే. అప్పటికి ఇక ఎవ్వరూ మిగిలి వుండరు. అంతా ఆమెలో కలసి పోతుంది, తిరిగి ఆమె కూడా అయినలోకి కలసి పోతుంది. రెండు అనేది ఒక్కటి అయిపోతుంది. రెండు బిందువులు ఒక్కటై ఒకే ఒక  పూర్ణ బిందువు అవుతుంది. అమ్మ లేనిదే అయ్య పూర్ణ బిందువు కాలేడు.
అప్పుడు ఉండే తత్వం ఒక్కటే.     అదే పూర్ణం. అందుకే అణువులు అన్నీ గుండ్రముగా బిందు రూపములో వుంటాయి.
అండము, బ్రహ్మాండము బిందు రూపములో వుంటాయి. బిడ్డ కలిగే ముందు అండము గుండ్రముగా బిందు రూపములో, అండము పిండముగా మారుతుంది. పిండము కూడా అదే బిందు రూపములో వుంటుంది. ఈ సృష్టిలో దేనినైనా తీసుకోండి దాని మూలము గుండ్రముగా బిందు రూపములో వుంటుంది. ఆత్మ బిందు రూపము, పరమాత్మ బిందు రూపము. అన్నీ బిందు రూపములే ఈ బిందువులు అన్నీ కలిస్తే ఒక మహా బిందువు. అదే మహా కారణ బిందువు. ఆ బిందువులో నుంచి వచ్చిన వన్నీ బిందువులే, సున్నాలే. ఆ బిందువే పూర్ణ బిందువు. బిందువులోనుంచి బిందువును తీసేస్తే వచ్చేది కూడా బిందువే. కాబట్టి పరమాత్మలో నుంచి వచ్చిన మన అందరము ఆత్మలమే, పరమాత్మలమే. అది తెలుసుకోనంత కాలము రెండు గా వుంటాము, అదే ఆత్మ, పరమాత్మగా వుంటాము. అదే ద్వైత స్థితి. ఇది భక్తుల స్థితి.
రెండు కాదు వుండేది ఒక్కటే అని తెలుసుకున్న నాడు మనము పరమాత్మలుగా మారి పోతాము. ఇది జ్ఞాని స్థితి.       
అదే అద్వైత స్థితి. భక్తుడు స్థితి ద్వైత స్థితి. జ్ఞాని స్థితి అద్వైత స్థితి. అందుకే జ్ఞాని భగవంతుడి లాగ సృష్టి చేయగలడు, ఎన్నో అత్బుతాలు చేయగలడు. మూగ వానికి మాటలు రప్పించ గలడు, కుంటి వానికి కాళ్ళు రప్పించ గలడు, గ్రుడ్డి వానికి కళ్ళు తెప్పించ గలడు.  తను
...

అయ్యా ఉండేది ఒకే తత్వము అయినప్పుడు ఎందుకొచ్చిన ఈ "కంచి గరుడ సేవ "... అని మీరు ఆడగ వచ్చు.
పుర్రె కో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.

ఆయుర్వేదములో ఒకే మందు ఒక్కో అనుపానముతో తీసుకొంటే ఒక్కో రోగము తగ్గుతుంది.
ఉదాహరణకు త్రిఫల చూర్ణము వేడి నీళ్ళతో తీసుకొంటే ఒక రోగమునకు మల బద్దకనికీ, అలాగే మజ్జిగతో తీసుకొంటే వేడిని తగ్గించతనికీ, అలాగే అశ్వగంధారిష్ట తో తీసుకొంటే ఒకలా, ద్రాక్ష రసాయనముతో తీసుకొంటే ఒకలా, వాజీకరమైన మకరద్వజముతో తీసుకొంటే ఒక రోగానికీ, పంచ తిక్త కషాయముతో తీసుకొంటే ఒక రోగానికీ ఇలా అదే త్రిఫల చూర్ణము రకరకాలుగా పని చేస్తుంది.
అలాగే మన రోగము ఏమిటో దానికి సంబంధించిన దేవతా మూర్తిని మనము ఆరాధించాలి. అందు కొరకు ఇంత మంది దేవతలు. మన లోని రాక్షసులను హత మార్చడానికే ఇన్ని విభూతులలో ఆ పరమేశ్వరుడు వచ్చి కాపాడుతున్నాడు.

మహా జ్ఞానులు లాంటి శ్రీ రమణ మహర్షులు, శ్రీ షిరిడీ బాబా లాంటి వారు జ్ఞాన స్వరూపులై ఆ పరమాత్ముని మాత్రమే చూస్తూ, నిరంతరం ఆత్మైకానుభూతిని పోదుతూ వుంటారు.

అదే అద్వైత స్థితి. భక్తుడు స్థితి ద్వైత స్థితి. జ్ఞాని స్థితి అద్వైత స్థితి. అందుకే జ్ఞాని భగవంతుడి లాగ సృష్టి చేయగలడు, ఎన్నో అత్బుతాలు చేయగలడు. మూగ వానికి మాటలు రప్పించ గలడు, కుంటి వానికి కాళ్ళు రప్పించ గలడు, గ్రుడ్డి వానికి కళ్ళు తెప్పించ గలడు.  తను అద్వైత స్థితిలో వున్నాడు కాబట్టి ఇంకోటి లేదు. ఎందుకంటే తనే పరమాత్మ కాబట్టి. అయితే భక్తునికి, జ్ఞానికి అంటే ద్వైత స్థితిలో వున్న వానికి, అద్వైత స్థితిలో వున్న వానికి ఇద్దరికీ మోక్షము వస్తుంది. ద్వైత స్థితిలో వున్న వాడు కొన్నాళ్ళకి తన సాధన వలన అద్వైత స్థితికి వస్తాడు. ద్వైత స్థితిలో వున్న వాడు భార్యాభర్తలుగా పుట్టి, గృహస్థ ఆశ్రమంలో వుండి సాధన చేస్తూ వుంటాడు, అది పరి పక్వత చెందినప్పుడు తను అద్వైత స్థితి గురించి తెలుసుకోన్నప్పుడు మరు జన్మలో జ్ఞానిగా, ఒక సాధువుగా, ఒక సన్యాసిగా, ఒక కంచి పరమాచార్యగా పుట్టి అద్వైత సాధనలో తనే పరమాత్మయై ఎన్నో లీలలు, వింతలు చేసి చూపుతారు. అందుకే జ్ఞానులను అనుకరించ కూడదు. వారు ఏమైనా చేస్తారు. ఎందుకంటే వారె పరమాత్మ స్వరూపము.  అహం బ్రహ్మస్మి గా వుంటారు వారు. వారు ఏదైనా చేయగలరు. అందుకే అద్వైత స్థితి  చాలా గొప్పది.

   పూర్ణ మదం: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
   పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే.

ఓకరు అడిగి ప్రశ్నకు నా సమాధానము ఇది....
( Letters to sri chaganti satsangam, 2012)

మీ భాస్కరానంద నాథ

Monday 14 September 2015

కర్మ ఫలితం....

కర్మ ఫలితం........

కర్మ ఫలం....తప్పదు ఎవరికైనా అనుభవించక... మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది...కర్మ బలీయమైనది ....

రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహామహితాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు.
"ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

"అమాయక బ్రాహ్మడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?"

"తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నదిగారడీ వాడి పాము మంత్రమో - విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?" అని ప్రశ్నించాడు కశ్యపుడు.

"అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

" సర్పరాజా! నీకిదే నా ప్రణుతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢ విశ్వాసం" ఆని  అన్నాడా కశ్యపుడు.

"తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో - మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విష శక్తి చూడు!" అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవంతయినా అబద్ధంలేదు.  ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి "అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!" అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశినుంచే తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్ర జపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహా వృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని "మహామంత్ర ద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసిన నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో - లేదో! నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మ మూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలి ప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం తక్షకుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. ఇంతకూ మీకు కావలసింది...." అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా "ధనమయ్యా! ధనం" అన్నాడు బ్రాహ్మణుడు.

"అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను" అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపేశాడు.

ఇంత వరకూ కథ బాగుంది.....ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సినది చాలా వున్నది...
మన తల వ్రాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు...
ఓక వేళ నాబోటి వాడు బయలుదేరినా వాడిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. అదే మనం చేసుకొన్న పాపం....పాప కర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరాకి భగవంతుడు కూడా....వాడి కర్మ కలిసిరావాలి.....కౌశికుడు బయలుదేరినా,  పరీక్షిత్తు యొక్క పాప కర్మ అడ్డు పడినది....ఏమిటి ఆ పాప కర్మ?  ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. మహా సాధువులతో చెలగాడటం....కోరి కోరి తన మృత్యువును అహంకారంతో తెచ్చుకొన్నాడు.......ముని శాపం వలన, తక్షకుడి కాటు వలన చనిపోలేదు, తన కర్మ చేత చనిపోయినాడు పరీక్షిత్తు ......గ్రహముల వలన కీడు జరగలేదు....ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అంతే విధముగా మానవునికి కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.....మన పాపములు గ్రహముల రూపములో మనల్ని అనుభవింప జేస్తాయి....నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.....మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది...కర్మ బలీయమైనది....

గోవిందా....నారాయణా....రామా....శివా....కాపాడు...కాపాడు...అని అంటాడు ఓకడు.
ప్రాణాపాయం లో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు.....
ఓరేయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా, నీ భార్య చేసిందా, నీ బిడ్డలు చేసినారా, నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? మీ గురువుల అనుగ్రహం వున్నదా? నీకు పుణ్యం లేదు, నీకు ధారపోసిన పుణ్యం లేదు....మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేదిరా? అనుభవించు నీ కర్మ .....అని అంటాడు.....

మన పుణ్యం మన జాతకంలో గురు రూపంలో కనిపిస్తుంది....గురు అనుగ్రహం వున్నదా? గురు దృష్టి వున్నదా? శుభ గ్రహ దృష్టి వున్నదా? వుంటే బ్రతికిపోతావు.....లేదా బాధ పడాలి, తప్పదు.....పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.....మనసు బాధ పడితే పాప కర్మ క్షయం అవుతుంది...

మనసు సుఖ పడితే పుణ్య కర్మ క్షయం అవుతుంది.....పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే...      ..ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు....అదే అకర్మ....వికర్మ...సుకర్మ......కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు...
తాత ముత్తాతలు చేసిన పుణ్య ఫలం, పాప ఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చితీరుతుంది.... .
ఆ పుణ్యమే నీ మనుమలన్ని కాపాడుతుంది కూడా...మీ వంశాన్ని కాపాడుతుంది.....ఇదే మన జాతకంలో రెండవ ఇల్లు, తొమ్మిదవ ఇల్లు స్పష్టంగా చెబుతుంది.....

మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృ దేవతలు చేసిన పుణ్య ఫలితం వలన బ్రతికి బయట పడతాము.....వారి పుణ్య ఫలం మనల్ని కాపాడుతుందీ ....
మనం చేసిన పుణ్య ఫలం మన బిడ్డలను కాపాడుతుంది.... అంతటి కృష్ణ కృపాకటాక్షములు వున్నవాడు కూడా మాయలో పడ్డాడు గదా! కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు....

కాలానికి,  మాయకు ఎవ్వరూ అతీతులు కారు...
దీనిలో మీరు మరోకటి కూడా గమనించాలి....తక్షకుడు విష నాగు అంటే ప్రారబ్ద కర్మ,  దానిని కూడా జయించింది మంత్ర శాస్త్రం....కాటు చేత పుష్పించిన మహా వృక్షం కాలి బూడిద అయితే మంత్రం మరలా చిగురింప జేసినది.....అంటే మంత్రం చేత ప్రారబ్ద కర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.....మంత్రం ప్రాణం పోస్తుంది....

మీ భాస్కరానంద నాథ...